జల వివాదంపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు.

గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి విస్త్రుతంగా సమావేశం చర్చించింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం, తెలంగాణ వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని,అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సిఎం మరోసారి స్పష్టం చేశారు. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశం పై ఆదివారం చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.