గంజాయిపై ఉక్కుపాదం మోపాలి : సీఎం కేసీఆర్

తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారని  చెప్పారు.

డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని చెప్పారు. వీటిని నియంత్రించేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని తెలిపారు. ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని అన్నారు.