డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జిల్లాలోని నర్సాపూర్‌లో కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పైలాన్‌ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. గేటెడ్‌ కమ్యూనిటీని తలదన్నేలా ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ సముదాయంలో మొత్తం 2460 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఉన్నాయి. ఈ కాలనీకి కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేశారు.

నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సుమారు రూ.163 కోట్ల వ్యయంతో 2460 ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. ఇందులో తొలివిడతగా 1341 ఇళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సమక్షంలో 144 మంది గృహ ప్రవేశాలు చేశారు. మిగిలినవారు విడుతల వారీగా కొత్త ఇళ్లలోకి వెళ్లనున్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు కరెంట్‌ మీటర్‌ నంబర్‌, వాటర్‌ కనెక్షన్‌ మార్పిడి పత్రం, ప్రాపర్టీ టాక్స్‌, కామన్‌ అఫిడవిట్‌, వంట గ్యాస్‌ సంబంధిత పత్రాలను అందించారు. మిగిలిన 1119 ఇళ్లను దశలవారీగా అర్హులకు కేటాయించనున్నారు.