భైంసా గురుకుల పాఠశాలలో కరోనా విజృంభణ

భైంసా: నిర్మల్‌ జిల్లా భైంసాలో కరోనా కలకలం కొనసాగుతోంది. కొవిడ్‌ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 25 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. భైంసాలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో గురువారం 176 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఇదే పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు బుధవారం కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ సోకిన విద్యార్థుల సంఖ్య 35కి చేరింది.

ఒకే పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా 140 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మండలంలో విధి నిర్వహణలో ఉన్న 29 మంది పోలీసులకు కొవిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.