యాదాద్రిలో పెరుగుతున్న కరోనా కేసులు..

యాదాద్రి టెంపుల్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్నటి వరకు యాదాద్రి టెంపుల్ సిబ్బందిలో 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఈరోజు ఇప్పటికే 26 మందికి కరోనా నిర్దారణ కాగా.. అందులో అర్చకులు, సిబ్బంది, జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డారు. ఇంకా యాదాద్రిలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. అయితే.. కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువగా అర్చకులు, టెంపుల్ సిబ్బంది ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా.. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339 కి చేరింది. ఇందులో 3,00,156 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,495 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,688 మంది మృతి చెందారు.