కరోనా ఎఫెక్ట్‌.. హోలీ వేడుకలపై ఆంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హోలీ వేడుకలపై ఆంక్షల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

రేపు, ఎల్లుండి వైన్స్‌ షాపులు బంద్

హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.