తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా

కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తిలో తెలంగాణలో 600 మంది భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు ఆ బ్యాంకు సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులు కొవిడ్-19 బారినపడుతున్నారని పేర్కొన్నారు. వైరస్ బారిన మరింతమంది ఉద్యోగులు పడకుండా చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు బ్యాంకులో సగం మంది ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, హైదరాబాద్‌లోని కోఠి, సికింద్రాబాద్‌లోని బ్యాంకు కార్యాలయాల్లోని సిబ్బంది కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామని మిశ్రా వివరించారు.