టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరికి కరోనా పాజిటివ్.. పరిస్థితి విషమం

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నాయకుడు సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ వైద్యం తీసుకున్నారు. అయితే గత మూడు రోజుల క్రితం ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 69 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,33,560కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7685కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 89732 యాక్టివ్ కేసులు ఉన్నాయి.