జనసేనకు వస్తున్న ఆదరణ చూడలేకే సిఎం జగన్ విమర్శలు

  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: జనసేనకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేకే సిఎం జగన్ సహా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పదేపదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. విద్యార్ధులు హాజరయిన సభలోనూ సిఎం జగన్… తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఆయన నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. తాజాగా వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మళ్లీ అవే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తమ నాయకుడిపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై విమర్శలు చేయడాన్ని డాక్టర్ హరిప్రసాద్ ఖండించారు. వాలంటీర్లపై తమ అధినేత చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారన్నారు. జససేనానిని ప్రాసిక్యూషన్ చేయాలని జివో జారీ చేయడం వైసీపీ పాలన అపరిపక్వతకు నిదర్శనమన్నారు. జనసేనానిపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని ఆ పత్రికా ప్రకటనలో హెచ్చరించారు.