నేటితో ముగియనున్న కర్ఫ్యూ.. మరికొన్ని రోజులు పొడిగించే యోచనలో ప్రభుత్వం

తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో నైట్ కర్ఫ్యూ ముగియనున్నది. అయితే, నైట్ కర్ఫ్యూ పొడిగిస్తారా లేదంటే లాక్ డౌన్ పెడతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నెల 20న విధించిన నైట్‌ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ పొడిగింపుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది.