ప్రియమణి స్పెషల్ పాత్రలో ‘సైనైడ్‌’

ప్రముఖ జాతీయ పురస్కార గ్రహీత, దర్శకుడు రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో పాపులర్‌ కథానాయిక ప్రియమణి నటించనున్న చిత్రం ‘సైనైడ్‌’. ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతుంది. కొన్నేళ్ల క్రితం 20 మంది అమ్మాయలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన నేరస్థుడు ‘సైనైడ్​ మోహన్’ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘దేశంలో సంచలనం సృష్టించిన ‘సైనైడ్‌’ మోహన్‌ కేసు ఆధారంగా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.’సైనైడ్‌’ ఇచ్చి 20 మంది యువతులను కిరాతకంగా హత్యచేసిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ మోహన్‌ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో ప్రియమణి ఇన్వెస్టిగేషన్‌ పోలీస్‌ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘దాదాపు 20 మంది యువతుల్లో ప్రేమను ప్రేరేపించి కర్ణాటకలోని వివిధ హోటల్‌ గదులలో వారితో శారీరక సుఖాలు అనుభవించి, ఆ తరువాత గర్భనిరోదక మాత్రల పేరిట సైనైడ్‌ ఇవ్వడం ద్వారా హత్య చేసి బంగారు ఆభరణాలతో బయటపడిన మోహన్‌ కథే ఈ సినిమా. ఈ కేసులో కోర్టు అతనికి 6 మరణశిక్షలు, 14జీవిత ఖైదులను విధించింది. ఈ కేసు తుది తీర్పుకూడా వెలువడింది. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అన్నారు. తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషించనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.