ఏపీకి తుఫాన్ ముప్పు.. నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా తాజాగా వాయుగుండం ముప్పు పొంచి ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. థాయిలాండ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది.

ఈ నెల 18 నాటికి రాష్ట్ర తీరానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ అధికారులు.. అది ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందన్న దాంట్లో స్పష్టత లేదన్నారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంతం పశ్చిమ బంగా వరకు ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న కూడా పలుచోట్ల చెదురుమదురు వానలు కురిశాయి.