రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధుపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద ప్రతీ లబ్దిదారుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 16న జరిగే సభలో 15 మంది లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చెక్కులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు.

అనంతరం రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందన్నారు. ఈ జాబితాలో వివరాలు లేనివారిని కూడా కొత్తగా నమోదు చేస్తారు. ప్రతీ గ్రామం నుంచి నలుగురు కో ఆర్డినేటర్లు ఉంటారు. గ్రామ సభ ద్వారా లబ్దిదారులను గుర్తిస్తారని తెలిపారు. దళిత రక్షక నిధిని కూడా ఏర్పాటు చేస్తామని రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.