వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. శ్రావణ శుక్రవారం సంధర్భంగా దుర్గాదేవి అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మీ దేవి అలంకరణ చేశారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు.

శ్రావణమాసం మూడో శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుపుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేశారు. ఇక మహిళలు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి పొంగళ్లు సమర్పిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లోను భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్నారు.