విజయ్ ఫ్యాన్స్కు నిరాశ.. ‘లైగర్’ టీజర్ వాయిదా
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పవర్ప్యాక్డ్ చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ ఉపశీర్షిక. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ కోసం రౌడీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విజయ్ దేవరకొండ పుట్టినరోజు పురస్కరించుకుని ‘లైగర్’ టీజర్ వస్తోందని అందరూ అనుకుంటున్న తరుణంలో పూరీ టీమ్ ఓ పోస్ట్ పెట్టింది. దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
‘దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరంతా ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతున్నారని ఆశిస్తున్నాం. పవర్ప్యాక్డ్ అంశాలతో కూడిన ‘లైగర్’ టీజర్ని మే 9న విడుదల చేయాలని భావించాం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న ఇబ్బందులు చూశాక.. టీజర్ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం.
మేము మీకు మాటిచ్చినట్లుగానే విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఆయన లుక్స్, డైలాగ్స్ పట్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉండదు. దయచేసి ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. శుభ్రత పాటించండి. మీ వాళ్లని ఆరోగ్యంగా చూసుకోండి. వ్యాక్సిన్ వేయించుకోండి. ధైర్యంగా ఉండండి’ అని టీమ్ పేర్కొంది.
పాన్ఇండియా సినిమాగా రానున్న ‘లైగర్’కు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.