నాపై అనర్హత వేటు సాధ్యం కాదు: ఎంపి రఘురామ

తనపై వైసిపి ప్రభుత్వం అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని నర్సాపురం వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రఘురామ శనివారం మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలను మాత్రమే ప్రస్తావించానని చెప్పారు. కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానన్నారు. వాస్తవాలు దాగవని, ఎప్పటికైనా బయటకు వస్తాయని తెలిపారు. తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్‌ మోషన్‌ ఇస్తానని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని తెలిపారు.