ఇచ్చాపురం మున్సిపాలిటీలో త్రాగు నీటి సమస్య

*అధికారులు నిర్లక్ష్యంపై జనసేన ఆగ్రహం

మున్సిపాలిటీ వార్షిక పన్నులు 15 శాతం పెంచినప్పటికీ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కేటాయింపులో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యేకంగా త్రాగు నీటి విషయంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు గారు ఈరోజు త్రాగు నీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్ విజయవాడ సమావేశానికి వెళ్లిన కారణంగా, ఆయన స్థానంలో ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ తలగల ప్రితివితో చర్చించి వివరణలు కోరారు. దాసరి రాజు చెప్పారు:
“ఏప్రిల్ 20న ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ బాబు, కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో నీటి సమస్యను ప్రస్తావించగా, రోజుకు 6 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్పారు. కానీ వాస్తవానికి రోజు తక్కువగా 4 ట్యాంకర్లే మున్సిపాలిటీ లెక్కలో నమోదు కావడం చూస్తే, ఇది తీవ్ర నిర్లక్ష్యం.” ఇచ్చాపురంలో 30,000 మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, కేవలం 20 ట్యాంకర్ల ద్వారా 23 వార్డులకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. పైగా, ప్రైవేట్ వ్యక్తులకు నీరు విక్రయించడం, ఫిల్లింగ్ పాయింట్ల వద్ద గంటల తరబడి ఆలస్యం కావడం వంటి సమస్యలపై కూడా దాసరి రాజు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు రోజుల్లో పూర్తిగా నీరు సరఫరా చేయాలని చెప్పారు. కానీ సోమవారం వరకు గడువు కోరడం వల్ల, పని 10 రోజులకు లాగబడేలా కనిపిస్తోంది. ఇది తీవ్ర నిర్లక్ష్య ధోరణి,” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యే, కలెక్టర్ సమక్షంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిచో జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment