తెలంగాణలో సెప్టెంబరు 1న విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

కరోనా ప్రభావంతో తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను సెప్టెంబరు 1న పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్ తాజా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ నివేదికను సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ నిన్న సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలు తెరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో, సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

విద్యాసంస్థల్లో తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్టు 30 లోపు క్లాస్ రూములు, హాస్టల్ గదులు, అన్ని విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేశారు.