రేపు ఈటల రాజీనామా

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను కేబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం ఆరోపణలపై తనను సంప్రదించకుండా తొలగించారని ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపీ నేతలు ఈటలను కలవడం, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవడంతో పార్టీ మారుతున్నారని స్పష్టం అయింది.