- ఎన్.ఎస్.ఎస్.ఆర్డీ విభాగం పర్యవేక్షకులు సంజయ్ కుమార్
- ఏ.కే.యూ ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం
ఒంగోలు, ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణయే ప్రధాన ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ఇందు కోసం యువతీ యువకుల శక్తి వంచన లేకుండా పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసులు – క్రీడా విభాగం మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొక్కల పెంపకాన్ని, పారిశుధ్య పనుల నిర్వహణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను మనం నాటినట్లయితే అవి మన ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ప్రాణ వాయువును అందించడమే కాకుండా మానవాళి మనుగడకు ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయన అన్నారు. అంతే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని,అదే సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రధాన రహదారుల ప్రక్కన ఉన్న పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమం లాగా చేపట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. ఆర్డీ విభాగం ప్రతినిధి సంజయ్ కుమార్ అన్నారు. యువకులైన విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమన్వయంతో పారిశుధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఏ.కే.యూ ఎన్.ఎస్.ఎస్.విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్.టి.సి. డిపో, మార్కెట్ ప్రాంతాలలో ఎస్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొని 120 కిలోలకు పైగా చెత్తా చెదారాన్ని, ప్లాస్టిక్ వస్తువులను,ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. విభాగం హైదరాబాదు కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు ఎన్. శ్యేదా నాయక్ ఒంగోలు నగరంలోని పలు కళాశాలలకు చెందిన ఎస్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్లు టి. రాజేంద్ర బాబు, కే.రవి తేజ, పి.నీలిమ, కే.రాజ్ కుమార్ లతో బాటు వందలాది మంది ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment