ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విధించిన స్టే పొడిగింపు.. రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విధించిన స్టేను ఈనెల 10 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు స్పందించింది. ధరణి జీవోల పై కౌంటర్లు దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున ఏజీ కోర్టుకు విన్నవించారు. ధరణిపై మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని.. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని సూచించింది. సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనని చెప్పిన హైకోర్టు, ధరణిపై విచారణ ఈ నెల 10కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.