వరహాల గెడ్డ బాధిత రైతులను ఆదుకోవాలి..!

  • చిల్లంగి పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం పట్టణానికి చెందిన వరహాలగెడ్డ బాధిత రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావును, ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, బాధిత రైతులు కొల్లి రమణ, కాగిత సత్యనారాయణ, మీసాల రవికుమార్, పడాల గంగులు, మువ్వల రమేష్, గుడుపూరు శ్రీను, కొల్లి సాయికిరణ్, గారమణీ, కొల్లి వెంకటరమణ, కొల్లి రవికుమార్, తెంటు సుధాకర్ తదితరులు కలిసి బైపాస్ రోడ్ రైల్వే ట్రాక్ ఆవల ఉన్న వరహాల గెడ్డ బాధిత చిల్లంగి పొలాలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల గెడ్డ పార్వతీపురం మున్సిపాలిటీ మురుగునీరంతా బైపాస్ రోడ్డు దాటి రైల్వే ట్రాక్ ఆవల ఉన్న కొర్ల చెరువులో కలిసి అక్కడ నుండి రాళ్లగెడ్డలో కలుస్తుందన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం వరహాలగెడ్డ గట్టు రైల్వే ట్రాక్ దాటాక చిల్లంగి పొలం వద్ద గండి కొట్టిందన్నారు. దీంతో వరహాల గెడ్డలో ప్రవహిస్తున్న పార్వతీపురం చెత్తా, చెదారం, మురుగు, గాజు పెంకులు, గాజు సీసాలు, ఆసుపత్రిలో ఉపయోగించిన సూదులు, సిరంజీలు, సారా బాటిల్స్, పాడైన పరుపులు, స్మశాన వాటికలో వాడే మంచాలు, కుండలు, పరుపులు తదితరవి పొలాల్లోకి కొట్టుకు వచ్చి సుమారుగా 50 ఎకరాల మేర చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. ఈ విషయమే గత రెండేళ్లుగా సంబంధిత ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. తక్షణమే గండిపడిన వరహాల గెడ్డ గట్టును పునరుద్ధరించాలని కోరారు. అలాగే గత రెండేళ్లుగా నష్టపోయిన పంటకు ఎకరాకు 30,000 రూపాయలు చొప్పున రైతులకు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరహాల గెడ్డ బాధిత చిల్లంగి పొలం రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.