అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన

*పవన్, షెకావత్‌తో అఖండ గోదావరి ప్రాజెక్టు ఆరంభం

పర్యాటక రంగంలో మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి చేకూర్చేలా రూపొందించిన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ డా. పురందేశ్వరీ హాజరుకానున్నారు. రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త రూపాన్ని అందించనుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే పుష్కర ఘాట్ల అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చారిత్రాత్మక హేవలాక్ వంతెనకు నూతన ఆకర్షణ, పుష్కర్ ఘాట్‌ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, కడియం నర్సరీలను ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే, నిడదవోలు సమీపంలోని కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ, గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ, బ్రిడ్జిలంకలో బోటింగ్, టెంట్ సిటీ ఏర్పాటు, గోదావరి కాలువలో బోటింగ్, గోదావరి నదికి నిత్య హారతి వంటి పలు ఆకర్షణీయ అంశాలు అమలుకాబోతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏడాది 15–20 లక్షల మంది పర్యాటకులు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని, దాదాపు 8 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఒకే ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం నుండి రూ.375 కోట్లకు పైగా పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Share this content:

Post Comment