న్యాయవాదుల హత్యకేసులో అదుపులోకి నలుగురు..
పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాదుల హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుంటశ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావు, చిరంజీవిని పోలీసులు విచారిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని కల్వచర్ల వద్ద గట్టువామన్రావు, నాగమణిలు పట్టపగలే దారుణ హత్యకు గురైన విషయం విధితమే. వామన్రావు తండ్రి కిషన్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పైన పేర్కొన్న నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశంలో నిందితులను ఏ విధంగా పట్టుకున్నారో తెలియజేశారు.
కొత్త సిమ్కార్డు సాయంతోనే నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కాల్డేటా ద్వారా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్యోదంతానికి ముందు వామన్రావు కదలికల గురించి కుంట శ్రీనివాస్కు, మరో నిందితుడు అక్కపాక కుమార్కు మధ్య పలుమార్లు సంభాషణలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. మధ్యాహ్నం 12.02 నుంచి 12.30 మధ్యలో 10 సార్లు వారు మాట్లాడుకున్నట్లు తేలిందని, కొంతసేపటి తర్వాత నిందితులిద్దరూ సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకున్నారని పేర్కొన్నారు. నేరస్థలి నుంచి పారిపోయాక కుంట శ్రీనివాస్ కొత్త సిమ్కార్డును వినియోగించి కుమార్తో టచ్లో ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు తీరు గురించి తెలుసుకుంటూ ఫాలో అవడం మేమే గమనించామన్నారు. ఈలోగా మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కుమార్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ విషయం తెలియని కుంట శ్రీనివాస్.. కుమార్తో ఫోన్లోనే మాట్లాడుతూనే ఉన్నాడని, దీంతో అతడి కదలికల ఆధారంగా మహారాష్ట్ర పారిపోయినట్లు గుర్తించామని తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి వాంకిడిలో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.