గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం: పవన్ కళ్యాణ్

భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార ‘గానకోకిల’ లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. లతాజీ పాటకు భాషాబేదం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది. తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా….. తెల్ల చీరకు… పాటలు శ్రోతలను మెప్పించాయి అంటే లతాజీ గానమే కారణం. ఏడు దశాబ్దాలు పైబడి సాగిన ఆమె గానయజ్ఞం.. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని… ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.