ఏపీ వాసులకి గుడ్ న్యూస్ .. ఏపీ లో ఆపిల్ తయారీ

పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ తయారీ ప్లాంట్ లను ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా తన తయారీ యూనిట్ ని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా  ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టేందుకు రెడీ అవుతుంది. కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ఏరియాలో నిర్మితం అవ్వనున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆపిల్ సంస్థకు చైనాలో ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయని అక్కడ ఒక్కోక్క ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని అదే విధంగా కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు ముగించామని అంచనా వ్యయం ఇతర వివరాలను అతి త్వరలోనే తెలుపుతామన్నారు. గత చంద్రబాబు హయాంలో చేసినట్లుగా ప్రచారం కోసం ఫేక్ ఎంవోయూలు కుదుర్చుకునే విధానాలను జగన్ సర్కారు అవలంభించబోదని ఆయా సంస్థలతో పక్కాగా చర్చలు ఒప్పందాలు కుదిరిదిన తర్వాతే ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.