ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30% సిలబస్ తగ్గిస్తూ ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ 30శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో జూనియర్ కాలేజీల పని దినాలు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యా మండలి సిలబస్ ను తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. సిలబస్ తగ్గించడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నిర్వహించే పరీక్షలలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని స్పష్టం చేసింది.
అదేవిధంగా తొలగించిన 30 శాతాన్ని కాలేజీ లో ప్రతి రోజు సాయంత్రం గం.4-5 మధ్య మరియు ఖాళీ పీరియడ్ లలో బోధించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే కాలేజీలు తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోవడం తో విద్యాశాఖ సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.