అభిమానులకు గుడ్ న్యూస్.. మరో రెండేళ్లు సీఎస్కేకు ఆడనున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నిన్న 40వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. భారత జట్టుకు దూరమైన ధోనీ… ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

సీఎస్కేకు ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడని ఆయన అన్నారు. క్రికెట్ కు ధోనీ దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు భారీగా పెరగడంతో టోర్నీని ఆపేశారు. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు.

ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో ధోనీ ఆటతీరు సాధారణంగానే ఉన్నప్పటికీ… తన నాయకత్వ పటిమతో జట్టును రెండో స్థానంలో నిలిపాడు. రానున్న సీజన్లలో కూడా సీఎస్కేకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.