ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో గవర్నర్‌

వరంగల్: స్వాతంత్ర్య భారత్‌ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో రెండు చోట్ల ప్రారంభించింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనగా, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరంగల్ పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ర్టంలో 75 వారాల పాటు ఈ ఉత్సవ వేడుకలు కొనసాగనున్నాయి.