చిరంజీవినీ ప్రశంసించిన గవర్నర్.. ధన్యవాదాలు తెలిపిన చిరు!

టాలీవుడ్ సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) సంస్థ త‌ర‌ఫున 45 ఏళ్లకు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 

అపోలో స‌హ‌కారంతో సినీ కార్మికులు, జ‌ర్న‌లిస్టుల‌కు ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామ‌ని చిరంజీవి ప్ర‌క‌ట‌న చేయ‌డం గురించి తెలుసుకుని సంతోషించాన‌ని చెప్పారు. సమాజం ప‌ట్ల ఆయ‌న చూపిస్తోన్న బాధ్య‌త ప్ర‌శంసనీయ‌మ‌ని పేర్కొన్నారు.

త‌మిళిసై చేసిన ట్వీట్ కు చిరంజీవి స్పందించారు. ‘గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మేడ‌మ్ గారికి సీసీసీ త‌ర‌ఫున‌ కృత‌జ్ఞ‌త‌లు. సీసీసీ ద్వారా సాయం చేస్తోన్న వారంద‌రికీ మీ ప్ర‌శంస‌లు ప్రోత్సాహాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.