ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలి: గురాన అయ్యలు

విజయనగరం: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకుడు గురాన అయ్యలు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు నరకం అనుభవిస్తున్నారన్నారు. లక్ష్యాలు పూర్తయ్యాయని, ట్రక్కు షీట్లు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. సంక్రాంతి పండగ నుంచి సక్రమంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రాత్రీ,పగలూ కల్లాల్లో కాపలా కాసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి ఖర్చులూ వచ్చే ఆస్కారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతోనే సాగు చేశారని, ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రం సిబ్బంది కల్లాల్లోనే ధాన్యం తూకం వేసి మిల్లర్ల వద్దకు చేర్చడంతోపాటు 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తారని ముఖ్యమంత్రి చెప్పారని.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. మిల్లర్లు రైతులకు సహకరించలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు గడువు పెట్టడం దారుణమన్నారు. రైతుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.