గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా 140 గ్రామాలలో 16,116 మొక్కలు..

తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బుధవారం మొక్కలు నాటారు. జడ్చర్ల నియోజకవర్గంలోని 140 గ్రామాలలో 16116 మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఆ మేరకు ఈరోజు తమ నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ పుట్టినరోజు తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని తెలిపారు. పచ్చదనం పెంచడం కోసం ఈ చాలెంజ్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తన విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.