తెలంగాణ ఉద్యోగుల బదిలీకు గ్రీన్ సిగ్నల్..
రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగుల్లో అధిక శాతం ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబం ఓ చోట.. ఉద్యోగం మరోచోట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత ఉద్యోగులు అటూ ఇటూ చెల్లాచెదురయ్యారు. హైదరాబాద్లో స్థిరపడి కుటుంబాలతో నివసిస్తున్న చాలామంది ఉద్యోగులకు ఏపీ కేటాయించడంతో విజయవాడ రావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఉద్యోగం ఓ ప్రాంతంలో, కుటుంబం మరో ప్రాంతంలో ఉండి మానసిక వేదన అనుభవిస్తూ వచ్చారు. తమ కష్టాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నివేదించారు తెలంగాణ ఉద్యోగులు. కుటుంబాలు హైదరాబాద్లో ఉండటంతో ఏపీలో ఉద్యోగం చేయడం కష్టంగా మారిందని జగన్కు వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని నివేదించారు.
గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించగా..కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుంచి ఏపీకు సంబంధిత ఫైల్ను పంపింది. వెంటనే ఉద్యోగుల బదిలీ పైల్ను క్లియర్ చేసి తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. తమ సమస్యలపై గొప్ప మనస్సుతో స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.