గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం

గుడివాడ పట్టణం, నెహ్రూచౌక్ సెంటర్లోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా నాయకుడు మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలస్థాయి, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై నాయకులు చర్చించారు. ప్రజల మద్దతుతో జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటుకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని, ఆ దిశగా సామాజిక సమతుల్యత పాటిస్తూ, యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు బూరగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు.