కలాం సేవలను కొనియాడిన గుంటూరు జనసేన

  • అబ్దుల్ కలాం గారు కారణజన్ముడు

గుంటూరు, అతి సామాన్య కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో అత్యంత క్రమశిక్షణతో ప్రపంచ అంతరిక్ష రంగంలోనే భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచిన మహనీయుడు, కారణజన్ముడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పార్టీ జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… అబ్దుల్ కలాం జీవితంలోని ప్రతీ అంశం ఆదర్శనీయమని, నేటి యువత ఆయన జీవిత సారాన్ని ప్రామాణికంగా తీసుకొని తమ తమ రంగంలో విజయాలను సాధించాలని కోరారు. అబ్దుల్ కలాం మహా జ్ఞాన సంపన్నుడని అతని మేధస్సు మొత్తం దేశాభివృద్ధికి, దేశ రక్షణకే వినియోగించాడని కొనియాడారు. యువకులకు, విద్యార్థులకు తన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ క్రమంలోనే స్వర్గస్థులు అయిన అబ్దుల్ కలాం జీవితం చరితార్ధమైనదని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్శి తన్నీరు గంగరాజు, లక్ష్మీశెట్టి నాని, షర్ఫుద్దీన్, వడ్డె సుబ్బారావు, కొలా అంజి, శిఖా బాలు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.