తెలుగురాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ

తెలుగురాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. కర్నూలుజిల్లా మంత్రాలయంలో గురుపౌర్ణమి వేడుకలు తులసివనంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అటు బాసర, హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ వెలుగుల అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటోంది. సాధారణ భక్తుల నుండి మొదలుకొని, వివిఐపిల వరకు ఈరోజు బాబాను దర్శించుకుంటున్నారు. బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా దేవస్థానం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

గురువులను, ఉపాధ్యాయులను , పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకోవడం శుభ సూచికమని భావిస్తారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కావున ఈ రోజుకింత ప్రాధాన్యత ఏర్పడింది.