ఏపీలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్‌లు: సీఎం జగన్

ఏపీలో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం కోసం ప్రజలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తరలి వెళుతున్నారని వెల్లడించారు. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలని అధికారులకు హితవు పలికారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని, జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 హెల్త్ హబ్‌లు ఉండాలన్నారు.

ఒక్కో హెల్త్ హబ్ కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాల స్థలం సేకరించాలని స్పష్టం చేశారు. ఒక హెల్త్ హబ్‌లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాల చొప్పున కేటాయించాలని సూచించారు. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయించాలని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలో మంచి ఆసుపత్రులు వస్తాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.