బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలంగాణలో వానలు పడుతున్నాయి. వచ్చే రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోనూ.. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది.

అటు ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.