రఘురామ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు..

ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వాదనలు పూర్తి అవడంతో.. బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు సూచించింది. ఎంపీని సీఐడీ కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాలని తెలిపింది. ఈ క్రమంలో ఎంపీని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అదనపు కోర్టులో రఘురామను హాజరు పరచనున్నారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్నరాత్రి హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ లేకుండా ఎంపీ అరెస్టును న్యాయవాది తప్పుబట్టారు. రఘురామ అరెస్టుకు సహేతుక కారణాలు లేవని కోర్టుకు వివరించారు. దీనిపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు.