పంట మీద కౌలు రైతులకు ఇచ్చిందెంత..?: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అయితే పంటల బీమా చెల్లింపులలో వారి వాటా ఎంత అనే విషయమై స్పష్టత లేదు. కొందరికి పంట నష్టం లక్షల్లో జరిగింది. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని కౌలు రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాయలసీమ జిల్లాలో గత ఏడాది వేరుశనగ రైతులు భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎకరాకు క్వింటాలు కూడా దిగుబడి రాలేదు. ఈ పంట సాగుకు ఎకరాకు 30 వేల పైన పెట్టుబడి అవుతుంది. ప్రభుత్వం పంటల బీమా పథకం కింద సగటున 2,674 రూపాయలు మాత్రమే ఇచ్చింది.

పేరుకే ఉచిత పంటల బీమా.. ప్రధాన పంట సాగు దారులకు అరకొర పరిహారము దక్కింది. ఇక కౌలు రైతులకు అందిన సాయం ఎంత అనేది ప్రశ్నార్థకమే. బీమా చెల్లింపు వ్యవహారమంతా ప్రభుత్వం చేతిలోనే ఉన్నా.. నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నా.. గత ఏడాది నల్ల తామర కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైరస్ వ్యాధులు కూడా దెబ్బ తీసింది. ఈ కారణాలతో నష్టం రావడంతో వాతావరణ ఆధారిత బీమా కింద పరిహారం చెల్లించామన్నది అధికారుల వాదన.

రాష్ట్రంలో మామిడి 8.40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా మామిడి రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. భారీ వర్షాలతో పూత దాకా వచ్చి రాలిపోవడంతో.. దిగుబడి తగ్గిపోతుంది. రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా బీమా పరిధిలోకి మామిడిని తీసుకురాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో.. ఎంత నష్టపోయారు? ఎంత భీమా మంజూరు చేశారు? అనే అంశాలను ప్రదర్శించాలి అని జనసేన పార్టీ తరఫున దారం అనిత డిమాండ్ చేశారు.