హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మిషన్‌ భగీరథ పరికరాలు ఉంచిన గదిలో గురువారం అర్ధరాత్రి 1.45 ని.లకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాజెక్ట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.