సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు తెనాలి ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా?

• సీఎం టూర్ కోసం విద్యుత్ లైన్లు కట్ చేయడం ఏమిటి?
ముఖ్యమంత్రి తెనాలి సభ కోసం ముస్తాబులు చేసుకోవాలి అంటూ విద్యుత్ లైన్లు కట్ చేయడం వల్ల తెనాలి ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయిన పరిస్థితి రోగులకు, ప్రమాద బాధితులకు శాపంగా మారిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయి. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు మృతి చెందిన ఘటన బాధ కలిగించింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలిస్తే విద్యుత్ సదుపాయం లేక వైద్య సేవలు నిలిచిపోవడంతో గుంటూరు, ఇతర ఆసుపత్రులకు తరలించాలని చెప్పడం అత్యంత దురదృష్టకరం. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఆ మార్గంలో విద్యుత్ నిలిపివేయడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ముఖ్యమంత్రి సభ మెహర్బాణీ కోసం విద్యుత్ లైన్లు కట్ చేసి ముస్తాబులు చేయడం వల్లే మూడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దిండిపాలెం గ్రామానికి చెందిన మృతులు కష్ట జీవులు. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. క్షతగాత్రులకు పరిహారంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.