ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాస కేంద్రాలు : ఎర్రబెల్లి
వరంగల్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో గురువారం పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు పర్యటించారు. మైసయ్యనగర్, రామన్నపేటలనిఇ రెండు కాలనీలు, సంతోషిమాతగుడి, భద్రకాళి గుడి, ములుగురోడ్ తదితర ప్రాంతాలను మంత్రి సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించారు.
సంతోషిమాత గుడి సమీపంలోని కాలనీల్లో నీరు పెద్దయెత్తున నిలిచి ఉండడంతో అక్కడ సహాయక చర్యలు నిర్వహిస్తున్న డిఆర్ఎఫ్ సభ్యులతో ప్రయాణించారు. నీటి చిక్కుకున్న వరద బాధితులను వారితోపాటు కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం తన కాలినొప్పిన సైతం లెక్కచేయకుండా మోకాలిలోతునీటిలో ఆయా కాలనీలను కలియతిరిగారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాస కేంద్రాలు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. సహాయ కార్యక్రమాలను వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు, నగర కమిషనర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందరికీ సహాయక చర్యలు అందుతాయన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే కంట్రోల్ రూంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్చేయాలని సూచించారు. వరద సహాయం కింద తక్షణమే రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ ఈ సహాయాన్ని ప్రకటించారని చెప్పారు. ఈమేరకు ఆ నిధులతో తక్షణ సహాయక చర్యల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు వరద ముంపు ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు.