షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: జలీల్

హైదరాబాద్‌: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. హాల్ టికెట్లు కూడా ఇచ్చామని, జంబ్లింగ్‌ కూడా అయిపోయిందన్నారు. మే 1 నుండి ఇంటర్‌ ఫస్టియర్ , మే 2న సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనాతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పరీక్షలు రద్దు చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జలీల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1771 సెంటర్లు ఉన్నాయని, అదనంగా 400 సెంటర్ల ఏర్పాటు చేశామని తెలిపారు. ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి 8.50 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని జలీల్ చెప్పారు.