ఏప్రిల్‌ 9 నుంచి ఐపిఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభం!

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)-2021 ఏప్రిల్‌ 9న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు లీగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు జరిగిన ఐపిఎల్‌ పాలకమండలి సమావేశంలో తీర్మానించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఈ ఐపిఎల్‌ లీగ్‌ నిర్వహణ వేదికల గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వేదికల సంఖ్యను ఈ సమావేశంలో ఎటూ తేల్చలేకపోయారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నాలుగైదు వేదికల్లో నిర్వహించేందుకు బిసిసిఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమిత సంఖ్యలోనే వేదికలను ఎంపిక చేయడంతో పలు నగరాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశంలో వేదికలపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో ఏదో ఒక నగరంలోనే ఐపిఎల్‌ లీగ్‌ను నిర్వహించాలని బిసిసిఐ భావించింది. అనంతరం నాలుగైదు నగరాల్లో జరపాలన్న ప్రతిపాదనలు రావడం.. ఆ మేరకు కొన్ని నగరాల పేర్లను బిసిసిఐ వర్గాలు పేర్కొనడం జరిగింది. పలు ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరాలు ఆ జాబితాలో లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయాన్ని బోర్డు వర్గాలు పున్ణసమీక్షించనున్నాయి.