టీవీ నగర్ ఏర్పాటుకు ఈటల హామీ
టీవీకళాకారుల కోసం టీవీ నగర్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రితో మాట్లాడతాననిమంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఆదివారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు టెలివిజన్ పరిశ్రమ నివేదన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈటల మాట్లాడుతూ.. టీవీ రంగ కళాకారులకు హెల్త్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ.. టీవీ నగర్ ఏర్పాటు 2006 నుంచి పెండింగ్లో ఉందన్నారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఒక కళాకారుడిగా తనకు కళాకారుల బాధలు తెలుసని, తాను స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కళాకారుల సమస్యలను విన్నవిస్తానన్నారు. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురే్షకుమార్ మాట్లాడుతూ.. బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, కార్యక్రమ నిర్వాహకులు, బుల్లితెర కళాకారులు సత్యం, ప్రసాద్, సాయి బాల, పెద్ద, చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.