బీసీల నయవంచకుడు జగన్ రెడ్డి: ఆళ్ళ హరి

గుంటూరు, బీసీలను ఇంతగా మోసం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో మరొకరు లేరని, బీసీల నయవంచకుడు జగన్ రెడ్డి అంటూ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు తరలిరావాలని టీడీపీ బీసీ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పేరయ్య ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ నాయకులతో శ్రీనివాసరావుతోటలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం, సంక్షేమానికై గత ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు. బీసీ కులాల్లో కొన్నిటికి ఎంతో ఆర్భాటంగా కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి రూపాయి కూడా నిధిని కేటాయించలేదని దుయ్యబట్టారు. చివరికి పార్టీ పదవుల్లోనూ బీసీలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మాట్లాడితే నా బీసీలు అంటూ తియ్యగా మాట్లాడతూనే బీసీల జీవితాలను చిన్నాభిన్నం చేశారన్నారు. ఆ మాటలన్నీ గుండె లోతుల్లోంచి వచ్చినవి కావని , పెదాల మీద నుంచి వస్తున్నవే అంటూ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కపట ప్రేమను, చేసిన అన్యాయాన్ని ప్రతీ బీసీ సోదరుడూ గమనిస్తూనే ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల ఆగ్రహాన్ని వైసీపీ చవిచూడపోతుందని టీడీపీ బీసీ నేత పేరయ్య అన్నారు. మంగళవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పాల్గొనే బీసీల డిక్లరేషన్ సభకు పెద్దఎత్తున బీసీలు తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, 22 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్, షేక్ గౌస్, ఆదాం, కోలా మల్లి, నైజామ్ బాబు, జిలాని, కరీమ్, పూసల శ్రీను, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.