యువత శక్తివంతంగా ఎదగాలి: మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. గురువారం వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డి పల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు సాధన కోసం మలిశెట్టి వెంకటరమణ ఇరుజట్ల కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఇండేన్ గ్యాస్ వద్ద గల తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు.