న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

నూజివీడు టౌన్: ల్యాండ్ టైటిల్ యాక్ట్ – 2022 ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరాహార దీక్షలకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఉమ్మడి కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి, నూజివీడు నియోజకవర్గం నేత మరీదు శివరామకృష్ణ తెలిపారు. బుధవారం కోర్టుల వద్ద నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న నిరాహార దీక్షలకు జనసేన పార్టీ బృందం మద్దతు తెలియజేసింది. ఈ శివరామకృష్ణ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఈ చట్టం న్యాయ వ్యవస్థను భస్టు పట్టించి, ప్రజాహస్తి హక్కులను నిర్ణయించే అధికారం ఒక అధికారికి ఇవ్వటం అంటే అధికార పార్టీ నాయకులకు భూములను దాసోహం చేయటమే అన్నారు. వారు చేసే అన్యాక్రాంతానికి, ఆక్రమణలకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. కోర్టులు కాకుండా ప్రభుత్వ అధికారులు భూమి హక్కును నిర్ణయించాల్సి వస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసని అన్నారు. న్యాయవాదుల దీక్షకు జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ నాయకులు బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్, నియోజకవర్గ వీరమహిళ నాయకురాలు రామిశేట్టి, తేజస్విని, చెరుకుపల్లి కిషోర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.