గ్రేటర్‌వార్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన నేతలతో తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన పార్టీ తమను సంప్రదించలేదని, ఒకవేళ చర్చిస్తేఆలోచించేవారమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీలో ఏయే అంశాలను చర్చిస్తున్నారన్నదానిపై ఆసక్తి నెలకొనగా..  సమావేశం అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ…  2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు. దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదన్నారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదన్నారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోడ్ మ్యాప్ రూపొందించుకుంటామన్నారు.